తిరుప్పూర్ జిల్లా పల్లడం సమీపంలోని పచ్చపాళెయంలో అద్దెకు ఉంటున్న పళనిస్వామి – ధనలక్ష్మి దంపతుల 21 ఏళ్ల కూతురు పూవరసి.
ఆమె దిండిగల్కు చెందిన అక్షయ్ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని, తల్లిదండ్రులకు తెలియకుండా రహస్య వివాహం చేసుకుంది. ఈ విషయం పూవరసి కుటుంబ సభ్యులకు తెలియడంతో, తల్లిదండ్రులు పూవరసి తాళిని తొలగించి అక్షయ్తో సంబంధాన్ని తెంచేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అక్షయ్, కుటుంబ సభ్యులను సముదాయించడానికి ఇంటికి వచ్చినప్పుడు ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది.
వాగ్వాదం ముదిరిపోవడంతో ఊగిపోయిన అక్షయ్, ఇంట్లో ఉన్న కత్తి (కొడవలి) తీసుకొని అత్త ధనలక్ష్మిని విచక్షణారహితంగా నరికి చంపాడు. ఇది చూసి షాక్ తిని, నన్ను వదిలేయాలని ప్రాణాల కోసం వేడుకున్న భార్య పూవరసిని కూడా కనికరం లేకుండా నరికి పొట్టనబెట్టుకున్నాడు. కేకలు విని పరుగెత్తుకొచ్చిన చుట్టుపక్కల ప్రజలు, రక్తపు మరకలతో పారిపోవడానికి ప్రయత్నించిన అక్షయ్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకుని జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటనే నిదర్శనం.
