ఇటీవల ఎక్స్ (X) ప్లాట్ఫారమ్లో వైరల్ అవుతున్న ఒక రైలు బోగీ లోపలి చెత్త ఫోటో, దానితో పాటు ఒక ప్రయాణికుడు పంచుకున్న రాత్రి సమయ ప్రయాణ ఆవేదన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రజా నిబంధనలు, వ్యక్తిగత భద్రతపై ఒక పెద్ద చర్చకు దారితీసింది.
ఎక్స్ వేదికగా ఒక ప్రయాణికుడు పంచుకున్న వివరాల ప్రకారం.. తన సీటుకు సమీపంలో కూర్చున్న ఒక వ్యక్తి, దాదాపు 8 గంటల రైలు ప్రయాణంలో నిరంతరం ఏదో ఒకటి తింటూనే ఉన్నాడు. బోగీలో కుప్పల తొట్టి (డస్ట్ బిన్) చాలా దగ్గరలోనే అందుబాటులో ఉన్నప్పటికీ.. అతను తిన్న ఎంగిలి పదార్థాలు, ఖాళీ ప్లాస్టిక్ సీసాలు మరియు ఫుడ్ ప్యాకెట్లను ఏమాత్రం నాగరికత లేకుండా తన సీటు కిందే విసిరేస్తూ చెత్త కుప్పగా మార్చాడని సదరు ప్రయాణికుడు ఆరోపించారు.
అర్ధరాత్రి మొబైల్ టార్చర్:
అంతటితో ఆగకుండా, అర్ధరాత్రి వేళ తోటి ప్రయాణికులందరూ పడుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. ఆ వ్యక్తి తన మొబైల్ ఫోన్లో అత్యంత భారీ శబ్దంతో (లౌడ్ స్పీకర్లో) వీడియోలు పెట్టి అందరికీ నరకం చూపించాడు. మొదట అతని ప్రవర్తనను నిలదీసి, పద్ధతిగా నడుచుకోమని చెబుదామని అనుకున్నప్పటికీ.. ప్రస్తుత రోజుల్లో ముక్కు ముఖం తెలియని వ్యక్తులను ప్రశ్నిస్తే అది అనవసరమైన వాగ్వాదానికి లేదా గొడవలకు దారితీసే ప్రమాదం ఉందనే భయంతో తాను సైలెంట్గా ఉండిపోయానని ఆ ప్రయాణికుడు బాహాటంగానే పేర్కొన్నారు.
తనకు కుటుంబం, భవిష్యత్తు ప్రణాళికలు వంటి ఎన్నో బాధ్యతలు ఉన్నాయని.. అందుకే ఇలాంటి ఆకతాయిలకు బుద్ధి చెప్పడం కంటే, తన సొంత భద్రతే ముఖ్యమని ప్రాక్టికల్గా ఆలోచించి ఊరుకున్నట్లు ఆయన వివరించారు.
నెటిజన్ల స్పందన – రైల్వే హెల్ప్లైన్ సూచనలు:
ఈ పోస్ట్ నెటిజన్ల మధ్య విపరీతంగా షేర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. “భారతదేశంలోని చాలా రైళ్లలో ఇదొక చేదు నిజం బాస్” అని కొందరు అభిప్రాయపడగా.. మరికొందరు “ఇలాంటి వారిని నేరుగా ప్రశ్నించి ప్రమాదం కొని తెచ్చుకోవడం కంటే, వెంటనే ‘రైల్ మదద్’ (RailMadad) యాప్ ద్వారా లేదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ఎక్స్ ఖాతాలను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసి ఉంటే.. రైల్వే సిబ్బంది వచ్చి వారికి కరెక్ట్గా బుద్ధి చెప్పేవారు” అంటూ ప్రయాణికులకు ఉపయోగపడే సలహాలతో కామెంట్లు పెడుతున్నారు.
