భారతదేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ సంస్థ ప్రకటించింది.
కంపెనీ తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయం వల్ల భారతదేశంలోని సుమారు 250 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంచలన నిర్ణయాన్ని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కాస్ నెజాషియన్ అధికారికంగా ప్రకటించారు. దీనిపై ఆయన ఉద్యోగులకు పంపిన మెసేజ్ను, అలాగే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. “టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు.
“మా క్లయింట్లు (వినియోగదారులు) అందరూ అమెరికాలోనే ఉన్నందున, వారికి సేవలు అందించే విధులను తిరిగి అమెరికా దేశీయ మార్కెట్కే మారుస్తున్నాము. ఈ కొత్త నిర్ణయంతో భారతదేశంలో ‘ఓపెన్డోర్’ (Opendoor) కంపెనీ కార్యకలాపాలన్నీ ముగియనున్నాయి” అని ఆయన తెలిపారు.
మరింతగా ఈ నిర్ణయానికి గల ప్రధాన కారణాన్ని వివరిస్తూ.. “వివిధ రకాల విధులను నిర్వహించడం కోసం భారతదేశంలో మేము ఒక పెద్ద టీమ్ను ఏర్పాటు చేశాము. కానీ, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పురోగతి మరియు అమెరికాలోనే AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ బృందాల వినియోగం పెరగడం వల్ల.. ఈ పనులను విదేశాల (ఆఫ్షోర్) నుండి చేయించాల్సిన అవసరం ఇప్పుడు తగ్గిపోయింది” అని సీఈఓ స్పష్టం చేశారు.
అయితే, భారతీయ ఉద్యోగుల ప్రతిభ లోపించడం వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదని సిఈఓ స్పష్టం చేశారు. భారతీయ ఉద్యోగులందరూ ఎంతో నైపుణ్యం కలిగినవారని, కంపెనీకి వారు అందించిన సహకారం ప్రశంసనీయమని కొనియాడారు. ఉద్యోగాలు కోల్పోతున్న సిబ్బందికి చట్టప్రకారం అందాల్సిన లే-ఆఫ్ ప్యాకేజీ (ఇరవై శాతం లేదా అంతకంటే ఎక్కువ పరిహారం), కొత్త ఉద్యోగాల అన్వేషణకు అవసరమైన సహాయం మరియు ఇతర మద్దతును కంపెనీ అందిస్తుందని పేర్కొన్నారు.
ఐటీ రంగంలో ‘AI’ సాంకేతికత రాకతో భారతీయ ఉద్యోగుల ఉపాధికి ముప్పు వాటిల్లుతోందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేయడంతో, ప్రస్తుతం ఈ వార్త కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Leave a Reply