అమర్ కాలనీ కాల్పుల ఘటన: తన మహిళా మిత్రుడితో కలిసి కాస్త సమయాన్ని గడపాలని ఆశించిన ఒక 17 ఏళ్ల యువకుడు, అమర్ కాలనీలోని ఒక రెస్టారెంట్కు వెళ్లాడు. ఇద్దరూ తమకు నచ్చిన ఆహారాన్ని తింటుండగా, ముగ్గురు వ్యక్తులు రెస్టారెంట్లోకి వచ్చారు.
ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే, వారు ఆ యువకుడి కాలర్ పట్టుకుని దుర్భాషలాడుతూ బెదిరించడం మొదలుపెట్టారు. యువతి వారిని ఆపేందుకు ప్రయత్నించినా, వారు ఆమెను తోసివేశారు. అక్కడ ఉన్న వారంతా ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోయారు. ఇంతలో, రెస్టారెంట్ అంతా తుపాకీ మోతలతో ప్రతిధ్వనించింది. కాల్పుల శబ్దం వినగానే అందరూ భయాందోళనలకు గురై పరుగులు తీశారు. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని ముగ్గురు నిందితులు బైక్పై ఆయుధాలు చూపిస్తూ అక్కడి నుంచి పరారయ్యారు.
నిందితులు వెళ్లిపోయిన తర్వాత, రెస్టారెంట్లోని వారు లోపలికి వెళ్లి చూడగా.. కళ్ళ ముందు ఉన్న దృశ్యం అందరినీ భయాందోళనకు గురిచేసింది. కొద్దిసేపటి క్రితం చిరునవ్వులతో ఉన్న యువకుడు, ఇప్పుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని మిత్రురాలు కన్నీరుమున్నీరవుతూ, అతడిని బతికించమని అక్కడి వారిని వేడుకుంది. కానీ, ఆ ఘటన తీవ్రతకు ఎవరూ ముందుకు వచ్చే సాహసం చేయలేదు. చివరికి ఆమె పోలీసులకు సమాచారం అందించి, ఆ యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించేలా చేసింది. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసుల దర్యాప్తు: ఈ ఘటనపై అమర్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక విచారణలో, ఇది ఒక చిన్న గొడవ వల్ల జరిగినట్లు తెలుస్తోంది.
ఏం జరిగింది?: పోలీసుల వివరాల ప్రకారం, సాయంత్రం 7:54 గంటలకు పీసీఆర్ కాల్ ద్వారా సమాచారం అందింది. బాధితుడు తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్లో భోజనం చేస్తుండగా, అక్కడకు వచ్చిన ఒక బృందంతో స్వల్ప వాగ్వాదం జరిగింది. నిందితులలో ఒకడు బాధితుడి కుర్చీని తగలడంతో, యువకుడు దానిని ప్రశ్నించాడు. అప్పుడు గొడవ సద్దుమణిగినా, 4-5 నిమిషాల తర్వాత అదే బృందం మళ్లీ వచ్చి, బాధితుడిపై కాల్పులు జరిపి పారిపోయింది.
బాధితుడిని మొదట మూల్చంద్ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ (AIIMS) ట్రామా సెంటర్కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నా, నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
