డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లోని ఒక ఇంట.. అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ (భూగర్భ నీటి తొట్టి) తెరిచి చూసిన ఆ కుటుంబ సభ్యులకు ఊహించని షాక్ ఎదురైంది.
ఆ ట్యాంక్ నిండా లెక్కలేనన్ని పాములు కనిపించాయి. నీటిలో తిరుగుతున్న మొత్తం 27 పాములను అటవీ శాఖ అధికారులు (ఫారెస్ట్ డిపార్ట్మెంట్) సురక్షితంగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విడుదలై అత్యంత వేగంగా వైరల్ అవుతోంది.
మీ ఇంట్లో అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఉందా? అయితే ఈ వార్త మీకోసమే.. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నిర్మించుకోవడం అనేది ఒక సాధారణ విషయంగా మారిపోయింది. నేల తవ్వి అందులో ట్యాంక్ నిర్మించి, నీటిని నిల్వ చేసుకుని వాడుకోవడం చాలా కుటుంబాలకు అలవాటుగా మారింది. అయితే, చాలా మంది ఈ అండర్గ్రౌండ్ ట్యాంకులను సరిగ్గా శుభ్రం చేయరు లేదా సరైన నిర్వహణ (మెయింటెనెన్స్) పాటించరు.
ఎప్పుడూ మూతపెట్టే ఉంటుంది కదా అనే ఉద్దేశ్యంతో, ట్యాంక్ను శుభ్రం చేయకుండానే ఆ నీటిని ఉపయోగిస్తుంటారు. దీనివల్ల వాటర్ ట్యాంక్లో చిన్నపాటి పురుగులు, కీటకాలు చేరడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒక ఇంట్లో ఏకంగా 27 పాములు ఆ అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నుండి బయటపడ్డాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి..
ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లోని ‘సరాయ్’ గ్రామానికి చెందిన ఒక కుటుంబం తమ ఇంట్లో అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ను నిర్మించుకుంది. ఈ క్రమంలోనే వారు తమ వాటర్ ట్యాంక్ను శుభ్రం చేయడానికి మూత తెరిచి చూశారు. అప్పుడు ట్యాంక్లోని నీటిలో లెక్కలేనన్ని పాములు అటూ ఇటూ తిరగడం చూసి ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, వాటర్ ట్యాంక్లో ప్రాణాలతో ఉన్న ఆ చిన్న పాము పిల్లలను పట్టుకున్నారు. ఇలా మొత్తం 27 పాము పిల్లలను సజీవంగా పట్టుకుని, వాటన్నింటినీ సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
ఈ ఘటన గురించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ‘శిష్పాల్ సింగ్’ మాట్లాడుతూ.. “అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నుండి 27 పాము పిల్లలను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాము. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఆ వాటర్ ట్యాంక్ లోపలికి ఇన్ని పాములు ఎలా చేరాయన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు” అని అన్నారు.

Leave a Reply