గత ఏడాది వేసవిలో, ఇరాన్ తన వీఐపీలందరినీ మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధించింది. లొకేషన్ ట్రాక్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ దాడి చేయవచ్చని వారు భయపడ్డారు. అయితే, ఆ సమయంలోనే పాశ్చాత్య ఏజెన్సీలు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఆచూకీని కనుగొన్నాయని ఇప్పుడు వెల్లడైంది. కానీ అప్పట్లో వారి ఉద్దేశ్యం అధికార మార్పిడి (regime change) కానందున ఆయనకు ఎలాంటి హాని తలపెట్టలేదు. ఆ తర్వాతే టెహ్రాన్ ఒక పెద్ద తప్పు చేసింది.
టాప్ లీడర్లు, కమాండర్ల ఫోన్లను పక్కన పెట్టించారు కానీ, బాడీగార్డులు మరియు డ్రైవర్లను మాత్రం ఫోన్లు తీసుకెళ్లనిచ్చారు. దీంతో ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేయడానికి మొసాద్.. భద్రతను పర్యవేక్షించే కమాండోల వెంటపడింది. ఇప్పుడు ఖమేనీ బాడీగార్డే సీఐఏ (CIA) గూఢచారి అని తేలింది.
అవును, సీఐఏ తన గూఢచారిని ఖమేనీ భద్రతను చూసే ‘ఇన్నర్ సర్కిల్’లోకి పంపినట్లు డైలీ మెయిల్ నివేదిక పేర్కొంది. అతను సుప్రీం లీడర్కు ఎంత దగ్గరగా ఉన్నాడంటే, భవనంపై ఎప్పుడు దాడి చేయాలనే సమయాన్ని కూడా అతనే ఖరారు చేశాడు. ఇరాన్లో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి, సుప్రీం లీడర్ను ఒక రహస్య బంకర్లో దాచారు. ఆ బంకర్ లోపలికి వెళ్లడానికి ఎలివేటర్కే ఐదు నిమిషాల సమయం పడుతుంది.
గేట్ కెమెరా ద్వారా అంతా బయటపడింది
చాలా ఏళ్ల క్రితమే టెహ్రాన్ ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్ను మొసాద్ హ్యాక్ చేసింది. టెహ్రాన్లోని పాశ్చర్ స్ట్రీట్ కాంపౌండ్ ప్రవేశ ద్వారం వద్ద కూడా ఒక కెమెరా ఉంది. దీని ద్వారా సీనియర్ నేతలు, అధికారుల బాడీగార్డులు ఎవరు? డ్రైవర్లు కార్లను ఎక్కడ పార్క్ చేస్తారు? అనే విషయాలను ఇజ్రాయెల్ ఏజెన్సీ తెలుసుకుంది. ఇక శనివారం రానే వచ్చింది. అటు నుండి మిసైల్ దాడి జరుగుతుండగానే, ఇటు వైపు గూఢచారి కమ్యూనికేషన్ వ్యవస్థను కట్ చేసి బయటపడాలని నిర్ణయించారు.
దాడి తర్వాత యాప్లో మెసేజ్లు
టెహ్రాన్పై బాంబు దాడి ప్రారంభమైన వెంటనే, ఇజ్రాయెల్ ఇరానియన్లకు మెసేజ్లు పంపడం మొదలుపెట్టింది. నిజానికి ‘బాడెసబా’ (Badesaba) అనేది అక్కడ ప్రార్థన సమయాలను తెలిపే క్యాలెండర్ యాప్. ఇది లక్షలాది మంది ఫోన్లలో ఉంది. మొదటి భారీ పేలుడు జరిగిన కొద్దిసేపటికే, ఉదయం 9.52 గంటలకు ఆ యాప్ నుండి వరుసగా సందేశాలు రావడం మొదలయ్యాయి. “సాయం అందుతోంది… మీ మత గురువులకు వ్యతిరేకంగా తిరగబడే సమయం వచ్చింది” అని ఒక మెసేజ్, “ఆయుధాలు పట్టండి, స్వేచ్ఛ కోసం పోరాడండి” అని మరో మెసేజ్ వచ్చాయి.

Leave a Reply