ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, వివాహిత అయిన ప్రియురాలిని కలిసేందుకు రాత్రివేళ వెళ్లిన ఓ యువకుడిని సదరు మహిళ కుటుంబసభ్యులు పట్టుకుని, తలకిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఓ ప్రాంతానికి చెందిన ఆ యువకుడు, సమీప గ్రామంలో నివసించే వివాహితతో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఆ మహిళను కలిసేందుకు యువకుడు ఆమె ఇంటికి రాగా.. గమనించిన కుటుంబసభ్యులు అతడిని పట్టుకుని తాళ్లతో కట్టి తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. ఆపై ఓ చెక్క స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. అక్కడున్న కొందరు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని యువకుడిని రక్షించి పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. అయితే, ఘటన జరిగిన రోజే పోలీస్ స్టేషన్ బయటే ఇరువర్గాలు మాట్లాడుకుని రాజీ కుదుర్చుకోవడంతో పోలీసులకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదు.
దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే విభాగం కింద మాత్రమే యువకుడిపై కేసు నమోదు చేశారు. కానీ, ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత యువకుడిని తలకిందులుగా వేలాడదీసి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
ఈ వీడియో వెలుగుచూడటంతో అప్రమత్తమైన పోలీసులు.. యువకుడిపై అమానుషంగా దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తును ముమ్మరం చేశారు.

Leave a Reply