రూ.70 లక్షల జీతం, రూ.2 కోట్ల అప్పు.. ఒక్క రాత్రిలో ఉద్యోగం ఊడింది. 108 కంపెనీల్లో తిరస్కరణ.. కానీ, నేడు రూ.6,500 కోట్ల ప్రాజెక్టులకు సలహాదారు! ఉద్యోగం కోల్పోయిన యువకుడి అద్భుత విజయం..!!

ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేస్తూ అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయి, రూ.2 కోట్ల అప్పుల ఊబిలో చిక్కుకున్న ఢిల్లీకి చెందిన ఒక యువకుడు, తన కృషితో నేడు రూ.6,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కన్సల్టెంట్‌గా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.

ఈ విజయం గురించి ఢిల్లీకి చెందిన గౌరవ్ కావత్రా (37) తన లింక్డ్‌ఇన్ (LinkedIn) ఖాతాలో ఇలా పంచుకున్నారు:

“2018వ సంవత్సరంలో ఒక చైనీస్ మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసేవాడిని. అప్పుడు నా వార్షిక వేతనం రూ.70 లక్షలు (నెలకు రూ. 5.8 లక్షలు). విలాసవంతమైన జీవితం గడుపుతూ, సొంత ఇంటి కల కోసం రూ.2 కోట్ల గృహ రుణం తీసుకున్నాను. కానీ, దురదృష్టవశాత్తూ 2018 సెప్టెంబర్ 12న, నా పనితీరు బాగాలేదనే నెపంతో కంపెనీ నన్ను ఒక్కసారిగా ఉద్యోగం నుండి తొలగించింది. నాకు కేవలం 3 రోజుల నోటీసు పీరియడ్ మాత్రమే ఇచ్చారు.

అంతకుముందు భారీ జీతం అందుకున్న నాకు, ఆ తర్వాత వరుసగా 108 కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు, తల మీద రూ.2 కోట్ల అప్పు. చుట్టుపక్కల వారి ఎగతాళి, పిల్లల ప్రశ్నలు నన్ను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి నెట్టాయి. రాత్రంతా నిద్ర పట్టని పరిస్థితి.

ఆ సమయంలో కార్పొరేట్ ఉద్యోగాల కోసం ఎవరినీ వేడుకోవడం ఆపాలని నిర్ణయించుకున్నాను. సొంతంగా కన్సల్టెన్సీ రంగంలోకి అడుగుపెట్టాను. నాకున్న నైపుణ్యం, అనుభవం నాకు కొత్త మార్గాన్ని చూపాయి. ప్రస్తుతం భారతదేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న 65కు పైగా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాను. ఇప్పటివరకు రూ.6,500 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రధాన సలహాదారుగా (Lead Consultant) పనిచేసి గొప్ప విజయాన్ని సాధించాను.

‘కళాశాల పట్టాలు కాలక్రమేణా కాలం చెల్లవచ్చు, కానీ మన నైపుణ్యాలు మరియు అనుభవం ఎప్పటికీ తరగవు. ఆ రోజు ఉద్యోగం పోవడం నా జీవితానికి ముగింపు కాదు, అది నాకు ఒక కొత్త పుట్టుక’ అని గౌరవ్ కావత్రా గర్వంగా చెప్పుకొచ్చారు.”


Posted

in

by

Tags: