న్యూఢిల్లీ: వాతావరణ శాఖ (IMD) ఒక ఆశ్చర్యకరమైన హెచ్చరికను జారీ చేసింది. ఒకవైపు ప్రజలు ఎండలతో తపిస్తుంటే, మరోవైపు రాబోయే 12 గంటల వ్యవధిలో దేశంలోని 15 రాష్ట్రాలలో ఈదురు గాలులతో కూడిన తుఫాను మరియు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ ప్రకటించింది.
దక్షిణ తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్పై ఒక బలమైన ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టం నుంచి దాదాపు 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు దట్టంగా అల్లుకుపోయాయి. శాటిలైట్ డేటా ప్రకారం.. ఏపీ, తెలంగాణలపై ఒక పెద్ద గాలి సుడి తిరుగుతోంది.
దీనివల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర రీజియన్లలో ఉదయం నుంచి మేఘాలు పరుగులు పెడుతూ ఉక్కపోతను పెంచుతాయి. అయితే, మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీన్ మారుతుంది. విశాఖ, ఉత్తరాంధ్రలో మోస్తరు వానలు పడతాయి. రాయలసీమలో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ విషయానికి వస్తే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నిప్పుల కొలిమిలా మారుతుంది. కానీ, సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్తో పాటు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వాతావరణం కూల్ అవుతుంది.
నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు పడతాయి. రాత్రి 9 గంటల వరకు ఈ వాతావరణం కొనసాగే ఛాన్స్ ఉంది.
