మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) కొండ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర విషాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, 18 ఏళ్ల కుమారుడు.. ముగ్గురూ లోయలో పడి దుర్మరణం చెందిన ఘటన ఆ ప్రాంతమంతటా తీవ్ర దిగ్భ్రాంతిని, తీరని శోకాన్ని నింపింది.
వీకెండ్ గడపడానికని, ప్రకృతి అందాలను ఆస్వాదించడానికని కొండపైకి వెళ్లిన ఆ కుటుంబం ఇలా విగతజీవులుగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. క్షణాల్లో చోటుచేసుకున్న ఈ ఊహించని ఘోర దుర్ఘటన ఒక నిండు కుటుంబాన్నే పూర్తిగా తుడిచిపెట్టేసింది.
ఈ విషాదం వెనుక అందరి గుండెలను పిండేస్తున్న దృశ్యం ఏంటంటే.. ఆ కుటుంబం ప్రాణంగా పెంచుకున్న పెంపుడు కుక్క (షేరూ) ఇంటి గుమ్మం వద్దే యజమానుల కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం అందరి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. తన యజమానులు, తనను అమితంగా గారాబం చేసే ఆ 18 ఏళ్ల అబ్బాయి ఇక ఎప్పటికీ తిరిగి రారన్న చేదు నిజం తెలియని ఆ విశ్వాసంగల మూగజీవి, తాళం వేసి వెలవెలబోతున్న ఇంటి గడప ముందే ఆకలిదప్పులతో దీనంగా వేచిచూస్తోంది.
ఇంటి తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా, తమ యజమానులు ఎప్పుడు వచ్చి తనను ఆత్మీయంగా హత్తుకుంటారా అనే ఆశతో ఆ మూగజీవి గుమ్మం వైపే చూస్తున్న దృశ్యం రాతి గుండెలను కూడా కరిగిస్తోంది.
చుట్టుపక్కల వారు, స్థానికులు ఆ కుక్కకు ఆహారం, నీళ్లు పెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, అది దేన్నీ ముట్టుకోకుండా తీవ్ర వేదనతో ఆ ఇంటి తలుపుల వైపే వెర్రిగా చూస్తుండటం చూపరులను కలచివేస్తోంది. మనుషుల కంటే ఎక్కువ ప్రేమనొలకబోస్తూ, కృతజ్ఞతను చాటుకుంటున్న ఆ మూగజీవి మూగరోదన స్థానిక ప్రజల హృదయాల్లో తీరని ఆవేదనగా మారింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించిన ఈ విషాద ఘటన, వారి రాక కోసం గుమ్మం ముందే కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ఆ పెంపుడు కుక్క దీన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి.

Leave a Reply