నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం తర్వాత, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ప్రస్తుతం మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై దృష్టి సారించారు.
ఇందులో భాగంగా లాతూర్ జిల్లా ఔసా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించి, అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పాఠశాల ప్రాంగణంలో మద్యం సీసాలు కనిపించాయని, తాగడానికి నీటి వసతి గానీ సరైన మరుగుదొడ్ల సౌకర్యం గానీ లేవని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను రావడానికి కాసేపటి ముందే మరుగుదొడ్లను శుభ్రం చేశారని, మధ్యాహ్న భోజనం కోసం కొత్త ప్లేట్లను కేవలం ప్రదర్శన కోసమే తీసుకొచ్చారని ఆరోపించారు. తరగతి గదుల్లో కూర్చున్న విద్యార్థులు ఇతర పాఠశాలలకు చెందినవారని, వారిని అద్దెకు తీసుకొచ్చి కూర్చోబెట్టారని ఆయన తెలిపారు.
అయితే, పాఠశాల అధికారులు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఒకే భవనంలో రెండు వేర్వేరు పాఠశాలలు నడుస్తున్నాయని వివరించిన ప్రధానోపాధ్యాయుడు బాలాజీ గవాళీ, అక్కడున్న పిల్లలందరూ తమ పాఠశాల విద్యార్థులేనని, బయటి నుంచి ఎవరినీ తీసుకురాలేదని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులు ఎప్పటిలాగే తమ పాత ప్లేట్లలోనే భోజనం చేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు.
ఈ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంటూ దిప్కే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “పదేళ్ల పాలనలో కారుతున్న పైకప్పులను బాగుచేయలేక, కూర్చోవడానికి సరైన వసతులు కల్పించలేని ప్రభుత్వం అసలు సాధించిందేమిటి?” అని ప్రశ్నించిన ఆయన, విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు జంతువులకే మెరుగైన సౌకర్యాలు దక్కుతున్నాయని విమర్శించారు.
ఈ ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే తక్షణమే రాజీనామా చేయాలని దిప్కే డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన మండల విద్యాశాఖ అధికారులను (BEO) ఎనిమిది రోజుల్లోగా సస్పెండ్ చేయాలని కోరారు. పాఠశాలల్లోని వసతులు, పనితీరును సమీక్షించేందుకు సీజేపీ పార్టీ తరఫున 10 అంశాలతో కూడిన ప్రత్యేక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.
