గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఏర్పడిన అడ్డంకుల కారణంగా, భారతదేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈరోజు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. వంట గ్యాస్ను అత్యంత పొదుపుగా వాడాలని ప్రజలకు సూచించింది. ప్రస్తుతానికి ఇళ్లకు ఇచ్చే ఎల్పీజీ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే, వాణిజ్య వినియోగదారులను ఇతర ఇంధన వనరుల వైపు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ మాట్లాడుతూ.. “గృహ వినియోగ ఎల్పీజీ మరియు సీఎన్జీ వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా జరుగుతోంది. అయితే, ముందుజాగ్రత్త చర్యగా వాణిజ్య విభాగాలు పీఎన్జీ (PNG – పైప్డ్ నేచురల్ గ్యాస్)కి మారడం మంచిది” అని తెలిపారు.
వాణిజ్య వినియోగదారులపై నియంత్రణ: హోటళ్లు, రెస్టారెంట్లు మరియు క్యాటరింగ్ సర్వీసులు ఇకపై ఎల్పీజీ సిలిండర్ల వాడకాన్ని తగ్గించుకుని, పైపుల ద్వారా వచ్చే గ్యాస్ కనెక్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం నొక్కి చెప్పింది. వాణిజ్య సంస్థలు పీఎన్జీకి మారడం వల్ల లక్షలాది సిలిండర్లు ఆదా అవుతాయని, వాటిని ఇళ్లకు నిరంతరాయంగా సరఫరా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రాలకు 24 గంటల గడువు: పీఎన్జీ మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిన్న అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. అందులోని కీలక అంశాలు:
- పెండింగ్లో ఉన్న గ్యాస్ పైపులైన్ దరఖాస్తులకు 24 గంటల్లోపు అనుమతులు మంజూరు చేయాలి.
- రోడ్ల తవ్వకం మరియు మరమ్మతుల కోసం స్థానిక సంస్థలు విధించే ఛార్జీలను రద్దు చేయాలి.
- పైపులైన్ పనులను రాత్రింబవళ్లు నిర్వహించడానికి అనుమతించాలి.
- ప్రతి రాష్ట్రం ఈ పథకాన్ని పర్యవేక్షించడానికి ఒక ‘నోడల్ అధికారి’ని నియమించాలి.
పట్టణ ప్రాంతాల్లో పీఎన్జీ కనెక్షన్లు పొందాలనుకునే వారు సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థలను సంప్రదించవచ్చు. ఈమెయిల్, ఆన్లైన్ పోర్టల్ లేదా కాల్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతర్జాతీయంగా ముడి చమురు మరియు సహజ వాయువు ధరలు పెరుగుతున్నందున, రాబోయే నెలల్లో ఇంధన నిర్వహణ భారతదేశానికి ఒక పెద్ద సవాలుగా మారనుంది.
