బతికున్న సొంత తండ్రినే చనిపోయిన తన భర్తగా అబద్ధం చెప్పి, ప్రభుత్వం అందించే వితంతు పింఛన్ను ఒకే కుటుంబం దోచుకున్న షాకింగ్ మోసం ఉత్తరప్రదేశ్లోని బరేలీలో వెలుగుచూసింది.
బరేలీ సమీపంలోని ఆమ్లా ప్రాంతానికి చెందిన అచ్చన్ బతికే ఉన్నప్పటికీ, ఆయన భార్య అన్నీ బేగం, కుమార్తెలు స్వాలీన్ మరియు సన్నో బీ కలిసి, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ఈ విపరీతమైన మోసానికి పాల్పడ్డారు. మొదట భార్య అన్నీ బేగం తన భర్త అచ్చన్ చనిపోయాడని ఒక నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి పింఛన్ పొందింది. ఆ తర్వాత, ఆమె కూతుళ్లు స్వాలీన్ మరియు సన్నో బీ ఇద్దరూ తమ సొంత తండ్రి అచ్చన్నే తమ భర్తగా చూపిస్తూ, వేర్వేరుగా మరో రెండు నకిలీ డెత్ సర్టిఫికెట్లను పొంది, వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకుని నగదును కాజేశారు. ఇలా ఒకే వ్యక్తి పేరుతో మూడు నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేసి, బ్యాంక్ ఖాతాల ద్వారా రూ. 51,000 వరకు పింఛన్ డబ్బులను పొందారు.
ఈ దారుణ మోసంపై హసీనా బేగం అనే వ్యక్తి ముఖ్యమంత్రి ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ అవినాష్ సింగ్ ఆదేశాల మేరకు విచారణ జరపగా, ఈ దిగ్భ్రాంతికరమైన నిజం బయటపడింది. దీనిపై గత ఏడాది నవంబర్లో జిల్లా అధికారి మోనికా రాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందినప్పటి నుండి 8 నెలలుగా పరారీలో ఉన్న అన్నీ బేగం మరియు ఆమె ఇద్దరు కుమార్తెలను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. బతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా చూపించి మోసం చేయడంలో మున్సిపల్ మరియు అభివృద్ధి శాఖాధికారులు కూడా సహకరించినట్లు తేలింది. ఈ మోసం వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్ ఏమిటి, వీరు ఇంతవరకు ఇంకెవరెవరిని మోసం చేశారు అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Leave a Reply