అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఆస్టిన్ మెట్కాల్ఫ్ హత్య కేసులో 35 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న కార్మెలో ఆంథోనీ పునర్విచారణ (రీట్రయల్) పిటిషన్పై విచారణ ప్రారంభమైంది.
గతంలో ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జాన్ రోచ్ తప్పుకోవడంతో, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి మైఖేల్ సిట్టీ నేతృత్వంలో ఈ తాజా విచారణ జరుగుతోంది. విచారణ ప్రారంభంలోనే ఈ కేసులో ఇప్పటివరకు బయటకు రాని పలు కీలక విషయాలను కోర్టు ముందు ఉంచారు.
ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం.. కార్మెలో ఆంథోనీ గతంలో పంపిన కొన్ని టెక్స్ట్ మెసేజ్లలో ఒక వ్యక్తిని కత్తితో పొడిచినట్లు ఊహాజనిత (ఫాంటసీ) ఆలోచనలతో కూడిన సందేశాలను పంపినట్లు ఆరోపించారు. అంతేకాకుండా, హత్య జరిగిన రోజు ఉదయమే తాను ఒకరిని చంపేంత తీవ్రమైన మానసిక స్థితికి చేరుకున్నట్లు అతడు మెసేజ్ చేసినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ఈ ఆధారాలను బట్టి అతని నేరపూరిత మనస్తత్వం, గత ప్రవర్తనను నిరూపించేలా ప్రభుత్వం వాదనలు వినిపించింది.
మరోవైపు, హత్య ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే కార్మెలో మాజీ ప్రియురాలు అతడు తనను వేధిస్తూ వెంబడిస్తున్నాడని (స్టాకింగ్) పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఏప్రిల్ 2, 2025న స్కూల్కు వెళ్లిన ఆమె.. తాను కార్మెలోతో బ్రేకప్ చేసుకున్నానని, అయినప్పటికీ అతడు తనను అనుసరిస్తూ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. అదే రోజు జరిగిన అథ్లెటిక్స్ పోటీల సమయంలో ఆస్టిన్ మెట్కాల్ఫ్పై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటనలో ఈ ఫిర్యాదు ప్రస్తుతం కోర్టులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఈ కేసు తీర్పుపై జడ్జి జాన్ రోచ్ మీడియాతో మాట్లాడుతూ తాను ఇచ్చిన తీర్పు సరైనదేనని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో ఆయన ఈ విచారణ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అనంతరం ఈ కేసును రిటైర్డ్ జడ్జి మైఖేల్ సిట్టీ విచారిస్తున్నారు. ప్రస్తుతం కార్మెలో ఆంథోనీ టెక్సాస్లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కొత్త ఆధారాలు, వాదనల నేపథ్యంలో పునర్విచారణ పిటిషన్పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply