అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్కు వ్యతిరేకంగా ప్రారంభించిన యుద్ధం, ఇప్పుడు హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.
గత బుధవారం ఇరాన్కు చెందిన అత్యంత కీలకమైన యుద్ధనౌక ‘IRIS దానా’, శ్రీలంక తీరానికి సమీపంలో అమెరికా సబ్ మెరైన్ ప్రయోగించిన టార్పెడో దాడిలో సముద్రంలో మునిగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శతృ దేశ యుద్ధనౌకను సబ్ మెరైన్ ద్వారా ముంచివేసిన మొదటి ఘటనగా ఇది పరిగణించబడుతోంది. ఈ దాడిలో ఇరాన్ నౌకాదళ గర్వకారణంగా భావించే ఈ నౌక పూర్తిగా ధ్వంసమైందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ధృవీకరించారు.
భారత్లోని విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శనలో పాల్గొని తిరిగి స్వదేశానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. అంతర్జాతీయ జలాల్లో ఈ నౌక సురక్షితంగా ఉంటుందని ఇరాన్ భావించిన సమయంలో, అమెరికా పక్కా పథకం ప్రకారం దీనిని కూల్చివేసింది. ఈ దాడి సమయంలో నౌకలో సుమారు 180 మంది సిబ్బంది ఉన్నట్లు అంచనా. ఇందులో 87 మంది నావికులు మరణించగా, వారి మృతదేహాలను గాలే (Galle) రేవు ద్వారా ఇరాన్కు అప్పగించేందుకు శ్రీలంక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే శ్రీలంక నౌకాదళం మెరుపు వేగంతో సహాయక చర్యలు చేపట్టింది. సముద్రంలో చిక్కుకున్న 32 మంది ఇరాన్ నావికులను రక్షించి గాలే నగరంలోని ఆసుపత్రికి తరలించారు. మరో 100 మందికి పైగా నావికుల జాడ ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు, ఇరాన్ తన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ద్వారా హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించి, అమెరికా చమురు నౌకలపై దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగా డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
అయితే, యుద్ధం మొదలైన ఐదు రోజుల్లోనే అమెరికా భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. ఖతార్లోని అల్-ఉదీద్ స్థావరంలో 1.1 బిలియన్ డాలర్ల విలువైన రాడార్ వ్యవస్థను ఇరాన్ ధ్వంసం చేసింది. అలాగే మూడు అమెరికా F-15E యుద్ధ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ఇప్పటివరకు అమెరికా సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సంపత్తిని కోల్పోయినట్లు అంచనా. ఇజ్రాయెల్ రక్షణ కోసం తమ పన్ను డబ్బును ఎందుకు ఖర్చు చేస్తున్నారని అమెరికా ప్రజలు ఇప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టారు, ఇది ట్రంప్కు పెద్ద చిక్కుగా మారింది.

Leave a Reply