రాజన్న సిరిసిల్ల: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కార్మికుడు నల్లా విజయ్ కుమార్ మరోసారి తన అద్భుత సృజనాత్మకతను చాటుకున్నారు. ఒక అగ్గిపెట్టెలో సులభంగా ఇమిడిపోయేలా మడతపెట్టగలిగే అత్యంత అరుదైన పట్టుచీరను నేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
మన సాంప్రదాయ చేనేత కళకు, ఆధునిక నైపుణ్యాన్ని జోడించి ఆయన రూపొందించిన ఈ అద్భుత సృష్టి ఇప్పుడు చేనేత ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
అగ్గిపెట్టెలో పట్టే పూర్తి పొడవు చీర..
సుమారు 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు ఉన్న ఈ పట్టుచీర బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం. సాంప్రదాయ ‘ఇక్కత్’ (Ikkat) డిజైన్తో పూర్తిగా చేనేత మగ్గంపైనే నేసిన ఈ చీరను రూపొందించడానికి విజయ్ కుమార్ ఒక వారం రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించారు.
ఈ చీర యొక్క ప్రత్యేకత ఏంటంటే.. అత్యంత సూక్ష్మమైన మడతల ప్రక్రియ ద్వారా దీన్ని చాలా చిన్న సైజులోకి కుదించవచ్చు. ఇంత పెద్ద చీరను ఒక సాధారణ అగ్గిపెట్టెలో పెట్టేంత చిన్నగా మడతపెట్టగలగడం ఆయన అసాధారణ సాంకేతిక నైపుణ్యానికి అద్దం పడుతోంది.
కనకదుర్గమ్మకు పట్టుచీర సమర్పణ..
తన వినూత్న సృష్టి అయిన ఈ పట్టుచీరను విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లారు. అక్కడ అమ్మవారికి అలంకరించడం కోసం ఆలయ అధికారులను కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ అగ్గిపెట్టె పట్టుచీరను కానుకగా సమర్పించారు.
తండ్రి వారసత్వంలో సరికొత్త రికార్డులు..
చేనేత రంగంలో ఇప్పటికే ‘చేనేత కళారత్న’ అవార్డును అందుకున్న విజయ్ కుమార్.. దివంగత ప్రముఖ చేనేత కళాకారుడు నల్లా పరాంధాములు కుమారుడు. తన తండ్రి అందించిన సాంప్రదాయ వారసత్వాన్ని కొనసాగిస్తూ, చేనేతలో సరికొత్త నైపుణ్యాలను పరిచయం చేస్తున్నారని ఈ రంగంలోని నిపుణులు కొనియాడుతున్నారు.
గతంలో ఆయన నేసిన ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంతో కూడిన ప్రత్యేక శాలువాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహుకరించగా.. ప్రధాని సైతం ఆయన ప్రతిభను ఎంతగానో అభినందించారు. తాజాగా విజయ్ కుమార్ రూపొందించిన ఈ చేనేత అద్భుతం.. భారతీయ సాంప్రదాయ చేనేత కళ యొక్క గొప్పతనాన్ని, మన నేతన్నల అసాధారణ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

Leave a Reply