గుజరాత్ రాష్ట్రం అరవల్లి జిల్లా శ్యామ్లాజీ ప్రాంతంలో కుటుంబ కలహాల కారణంగా భర్తే తన భార్యను దారుణంగా హతమార్చిన ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
దంపతుల మధ్య ఇంటి పనులు చేసుకునే విషయంలో మొదలైన చిన్న వివాదం తీవ్ర గొడవగా మారింది. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త, పక్కనే ఉన్న గొడ్డలితో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది.
ఈ దారుణానికి ఒడిగట్టిన తర్వాత ఏమాత్రం భయం లేకుండా నేరుగా తన కొడుకు వద్దకు వెళ్లిన ఆ వ్యక్తి.. “మీ అమ్మ మాట్లాడట్లేదు, బహుశా చనిపోయినట్లుంది” అని అత్యంత సాధారణంగా చెప్పాడు. తండ్రి మాటలు విని హతాశుడైన ఆ బాలుడు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
భార్యను కిరాతకంగా చంపేసి కొడుకు ముందే ఏమీ తెలియనట్లు నాటకమాడిన ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. హత్య చేసిన అనంతరం పరారైన నిందితుడైన భర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply