ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లా జైత్పూర్ సమీపంలోని కమావుని గ్రామానికి చెందిన రైతు గంగారామ్.. సోమవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో చంబల్ లోయ ప్రాంతంలో తన పశువులను మేపుతున్నాడు.
ఆ సమయంలో దురదృష్టవశాత్తూ అతడిని ఒక విషపు తేలు కుట్టింది. తేలు కాటు వేసిన తీవ్రమైన నొప్పితో గంగారామ్ విలవిల్లాడిపోవడాన్ని గమనించిన తోటి కాపరులు వెంటనే అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకుని హుటాహుటిన వచ్చిన కుటుంబ సభ్యులు.. నొప్పిని తగ్గించేందుకు మొదట్లో కొన్ని మూఢనమ్మకాలు, సంప్రదాయ నాటు వైద్య చిట్కాలను ప్రయత్నించారు. అయితే ఆ పద్ధతుల వల్ల నొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువైంది. నొప్పితో గంగారామ్ నరకయాతన అనుభవిస్తూ స్పృహ తప్పే స్థాయికి చేరుకోవడంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు, చివరకు అతడిని చికిత్స నిమిత్తం జైత్పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సామాజిక ఆరోగ్య కేంద్రం)కు తరలించారు.
అప్పటికే పరిస్థితి విషమించడంతో, ఆసుపత్రి వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమించి అతనికి అత్యవసర వైద్య చికిత్స అందించారు. వైద్యుల తీవ్ర ప్రయత్నాల తర్వాత విష ప్రభావం తగ్గి నొప్పి అదుపులోకి రావడంతో, కుటుంబ సభ్యులు అతడిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లారు. పాము, తేలు వంటి విష కీటకాలు కుట్టినప్పుడు నాటు వైద్యాలతో సమయం వృథా చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.

Leave a Reply