మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఉన్న ప్రముఖ ఏసియన్ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున హఠాత్తుగా అగ్నిప్రమాదం సంభవించడంతో తీవ్ర కలకలం రేగింది.
ఈ ఆసుపత్రి మొదటి అంతస్తులో అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది.
శుక్రవారం తెల్లవారుజామున దాదాపు 2:10 గంటల సమయంలో, ఆసుపత్రి మొదటి అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU – నవజాత శిశువుల తీవ్ర చికిత్స విభాగం)లోని ఎయిర్ కండిషనర్ (ఏసీ)లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఆసుపత్రి మొదటి అంతస్తులో మొత్తం 58 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
వారిలో 9 మంది పసికందులు, జనరల్ వార్డులో 36 మంది రోగులు, ప్రత్యేక గదుల్లో 13 మంది రోగులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మంటలు చెలరేగడాన్ని గమనించిన ఆసుపత్రి వైద్య సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సహాయక చర్యల్లోకి దిగారు. మరోవైపు పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే రెండు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అయితే, ఆసుపత్రిలో ముందుగానే ఏర్పాటు చేసుకున్న అగ్నిమాపక భద్రతా వ్యవస్థలు, సిబ్బందికి అందించిన సరైన శిక్షణ కారణంగా.. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందే సిబ్బంది మంటలను చాలావరకు అదుపులోకి తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అనేక అంబులెన్సులను రప్పించి, మొదటి అంతస్తులోని 58 మంది రోగులను సురక్షితంగా బయటకు తరలించారు. ముఖ్యంగా, ఎన్ఐసీయూ (NICU) వార్డులో ఉన్న 9 మంది పసికందులను ఎంతో చాకచక్యంగా రక్షించి, సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంపై ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ షోయబ్ హష్మీ మాట్లాడుతూ.. “మా ఆసుపత్రి సిబ్బందికి పూర్తిస్థాయి ఫైర్ సేఫ్టీ శిక్షణ అందించాం. ఆ శిక్షణ వల్లే సిబ్బంది మంటలు వ్యాపించగానే మెరుపువేగంతో స్పందించి పెను విపత్తును నివారించగలిగారు. సరైన సమయంలో స్పందించకపోయి ఉంటే పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది” అని వివరించారు.

Leave a Reply