తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను సొంత కుటుంబ సభ్యులే దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్లిన అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన లలిత (35) అనే మహిళకు ఈ దారుణ పరిస్థితి ఎదురైంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లలితను కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్యం త్వరగా కుదుటపడకపోవడంతో పాటు, ఇకపై ఆమె బాగోగులు చూసుకోవడం తమ వల్ల కాదని భావించిన కుటుంబ సభ్యులు.. ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్పి ఆసుపత్రి నుంచి కారులో ఎక్కించుకున్నారు.
కానీ ఇంటికి తీసుకెళ్లకుండా, మార్గమధ్యంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లో ఆమెను పడేసి వెళ్లిపోయారు. ఆ దారిన వెళ్తున్న మల్లేష్ అనే వ్యక్తి అడవిలో నిస్సహాయ స్థితిలో పడి ఉన్న మహిళను చూసి వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని లలితను రక్షించి, మెరుగైన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లలిత కుటుంబ సభ్యులను సంప్రదించి సమగ్ర విచారణ ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న సొంత మహిళను కుటుంబ సభ్యులే ఇలా అడవిలో వదిలివేయడం స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు, దిగ్భ్రాంతికి దారితీసింది.

Leave a Reply