ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లో ఆరేసిన బట్టలు తీసేందుకు వెళ్లిన తల్లి, ఆమెను కాపాడబోయిన కొడుకు విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదం నింపింది.
తిక్రాపారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. మృతులను 54 ఏళ్ల కళ్యాణి బాయి యాదవ్, ఆమె 23 ఏళ్ల కుమారుడు మధుసూదన్గా గుర్తించారు. శుక్రవారం నాడు వీరిద్దరూ ఇంటి మేడపై ఆరేసిన బట్టలను తీసేందుకు వెళ్లిన సమయంలో అనుకోకుండా కరెంట్ షాక్కు గురైనట్లు పోలీసులు తెలిపారు.
రాయ్పూర్లో నర్సింగ్ చదువుతున్న కుమార్తెను చూసేందుకు కళ్యాణి బాయి తన కుమారుడితో కలిసి వచ్చింది. ఆమె కూతురుంటున్న అద్దె ఇంట్లోనే వీరు ఉంటున్నారు. ప్రమాదం జరిగిన రోజు మేడపైకి వెళ్లిన కళ్యాణి బాయి బట్టలు తీస్తుండగా విద్యుత్ వైరు తగిలి షాక్కు గురైంది. తల్లి విలవిల్లాడటం చూసిన కుమారుడు వెంటనే ఆమెను రక్షించేందుకు ముందుకు ఉరికాడు. అయితే తల్లిని కాపాడే క్రమంలో అతడు కూడా విద్యుత్ బారిన పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం, ఇంట్లోని కూలర్ నుంచి విద్యుత్ లీకేజీ జరిగి ఇనుప పైపు, బాల్కనీకి కరెంట్ సరఫరా అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బట్టలు ఆరేయడానికి కిటికీ కూలర్కు, మేడ గ్రిల్స్కు మధ్య ఇనుప తీగ లేదా పైపు కట్టారని, దాని ద్వారానే విద్యుత్ ప్రవహించి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
మరోవైపు, ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్పూర్-కుస్మీ మార్గంలోని సేవారి గ్రామం వద్ద కార్మికులతో వెళ్తున్న చిన్న గూడ్స్ వాహనం లారీని ఢీకొట్టింది. ఆ వాహనంలో 11 మంది కార్మికులు ప్రయాణిస్తుండగా, ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన 8 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ వరుస ఘటనలు ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Leave a Reply