వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠభరిత యుద్ధానికి తెరదించుతూ ఇరు దేశాల మధ్య ప్రాథమిక శాంతి ఒప్పందం (Preliminary Peace Accord) కుదిరింది.
ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా ఇరాన్కు అమెరికా పలు కీలక రాయితీలు, సలహా సహాయాలు అందించేందుకు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాల సమాచారం. ఇరాన్కు చెందిన ప్రముఖ ‘మెహర్’ (Mehr) వార్తా సంస్థ విడుదల చేసిన 14 అంశాల ముసాయిదా నివేదిక ప్రకారం.. యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 25 లక్షల కోట్ల) భారీ ఆర్థిక ప్యాకేజీని అందించేందుకు అంగీకరించాయి. దీనితో పాటు, విదేశీ బ్యాంకుల్లో ఇప్పటివరకు నిలిచిపోయిన ఇరాన్కు చెందిన 24 బిలియన్ డాలర్ల నిధులను కూడా విడుదల చేసేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇరాన్కు దక్కిన ఆ ‘రెండు మెగా జాక్పాట్లు’ ఇవే:
ఈ శాంతి ఒప్పందం ద్వారా ఇరాన్కు రెండు అతిపెద్ద ప్రయోజనాలు చేకూరనున్నాయి. మొదటిది.. ఇరాన్ చమురు, ఇంధన రంగాలపై అమెరికా విధించిన ఆంక్షలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనివల్ల ఇరాన్ మళ్లీ ప్రపంచ దేశాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముడి చమురును (Crude Oil) విక్రయించుకోవచ్చు.
ఇక రెండోది.. అంతర్జాతీయ సముద్ర రవాణాకు అత్యంత వ్యూహాత్మకమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) మార్గాన్ని ఇరాన్ తిరిగి తెరవాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగా రాబోయే 30 రోజుల్లో ఇరాన్ రేవులపై ఉన్న అమెరికా నౌకాదళ (US Navy) దిగ్బంధనాన్ని పూర్తిగా తొలగిస్తారు.
ఇంకా 60 రోజుల సస్పెన్స్:
అయితే, ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణ మరియు ఆర్థిక నిధుల విడుదలపై తుది నిర్ణయాలు తీసుకోవడంలో ఇంకా కొన్ని సాంకేతిక చిక్కులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 60 రోజుల పాటు ఇరు దేశాల మధ్య జరగబోయే ద్వైపాక్షిక చర్చలు (Bilateral Talks) ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

Leave a Reply