భారతదేశంలో దాదాపు ఏడాది సుదీర్ఘ విరామం తర్వాత 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రాబోయే సెప్టెంబర్ 12వ తేదీన న్యూఢిల్లీలో జరగనుంది.
ఈ భేటీకి ఒకరోజు ముందుగానే అధికారుల స్థాయి సన్నాహక సమావేశం కూడా జరగనుంది. సుదీర్ఘ విరామం అనంతరం ఈ కీలక సమావేశం జరుగుతుండటంతో, పన్ను విధానాల్లో పలు సానుకూల మార్పులను ఆశిస్తూ వాణిజ్య వర్గాలు, వ్యాపార సంస్థలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఈ సమావేశంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)కి సంబంధించిన సమస్యలకు పరిష్కారం కనుగొనడమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని భావిస్తున్నారు. వస్తువులను కొనుగోలు చేసిన సంస్థ సక్రమంగా పన్ను చెల్లించినప్పటికీ, విక్రయించిన సంస్థ చేసిన తప్పిదం కారణంగా కొనుగోలుదారుడి పన్ను రాయితీ రద్దయ్యే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ నిబంధనను సవరించి, నిబంధనలను సక్రమంగా పాటించే నిజాయితీపరులైన వ్యాపారులకు ఎలాంటి నష్టం కలగకుండా కొత్త విధానాన్ని తీసుకురావడంపై చర్చించే అవకాశం ఉంది.
అలాగే జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేయడంపై కూడా ఈ భేటీలో పరిశీలించనున్నారు. పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) ప్రతి రాష్ట్రంలోనూ విడివిడిగా పరిపాలనా నిబంధనలను పాటించాల్సి వస్తోంది. ఈ విధమైన వ్యాపార భారాన్ని తగ్గించడానికి, డాక్యుమెంటేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే అంశంపై చర్చించనున్నారు.
వీటితో పాటు, కార్యకలాపాలు సాగించని బోగస్/నిష్క్రియ సంస్థల జీఎస్టీ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడానికి ఆటోమేటెడ్ వ్యవస్థను తీసుకురావడం, గ్రూప్ కంపెనీల మధ్య ఇచ్చే కార్పొరేట్ గ్యారంటీలకు సంబంధించిన జీఎస్టీ నిబంధనలపై స్పష్టత ఇవ్వడం వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. దీని ద్వారా భవిష్యత్తులో వచ్చే అనవసరపు పన్ను వివాదాలను, న్యాయపరమైన చిక్కులను చాలావరకు నివారించవచ్చు.
ఈసారి పన్ను రేట్ల మార్పుల కంటే.. పన్ను నిర్వహణను సులభతరం చేయడం, వ్యాపార అనుకూల వాతావరణాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మరింత మెరుగుపరచడం వంటి అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పాల్గొనే ఈ సమావేశం నిర్ణయాలు అధికారికంగా వెలువడేంతవరకు ఎలాంటి మార్పూ ఖరారు కానప్పటికీ, ఈ పరిణామాలు వ్యాపార వర్గాల్లో సరికొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.

Leave a Reply