కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సిర్వార్ సమీపంలోని హొక్రాని గ్రామానికి చెందిన అశ్విని (21) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఆగస్టు 19వ తేదీ రాత్రి సమయంలో అశ్విని కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే ఎంత సమయమైనా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో అశ్విని శవమై తేలడం చూసి కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గుర్తుతెలియని దుండగులు అశ్వినిని కిడ్నాప్ చేసి, అత్యాచారానికి ఒడిగట్టి అనంతరం దారుణంగా హత్య చేసి బావిలో పడేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసుకున్న సిర్వార్ పోలీసులు, ఈ దారుణ హత్యతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. యువతిని అపహరించి, లైంగిక దాడి చేసి హత్య చేసిన ఈ ఘటన కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని, భయాందోళనలను నింపింది.

Leave a Reply