పుణె జిల్లాలోని ఇందాపూర్ ప్రాంతంలో భూ వివాదం కారణంగా తమ 65 ఏళ్ల వృద్ధ తండ్రి, తల్లిపై కర్రలతో కనికరం లేకుండా దాడికి పాల్పడిన ఇద్దరు కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పుణెకు చెందిన తుకారాం కిసాన్ రౌత్ (65) ఓ రైతు. ఆయన ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 6:00 నుంచి 6:30 గంటల సమయంలో తారంగ్వాడి పరిధిలోని సలీమ్ లాన్స్ సమీపంలో తన భార్య అంజనా రౌత్తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఆ సమయంలో టాటా నెక్సాన్ కారులో అక్కడికి చేరుకున్న వారి కుమారులు సంజయ్ తుకారాం రౌత్, రాజేంద్ర తుకారాం రౌత్ తల్లిదండ్రుల దారిని అడ్డగించారు. తల్లి పేరుపై రిజిస్టర్ అయి ఉన్న భూమిని విక్రయించడంపై గొడవకు దిగి, ఆ భూమిని తమకు తిరిగి ఇచ్చేయాలంటూ బెదిరించారు.
మాటమాట పెరగడంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు కొడుకులు వెంట తెచ్చుకున్న చెక్క దుంగలతో తల్లి, తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అంతేకాకుండా వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, భూమిని తమ పేరిట రాయకపోతే చంపేస్తామని హెచ్చరించారు.
ఈ దాడిలో తండ్రి తుకారాం రౌత్ వీపు, ముఖం, తొడలు, ఎడమ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లి అంజనాకు కుడి మణికట్టు, నడుము భాగంలో బలమైన గాయాలు తగిలాయి. వారి అరుపులు విని పరుగులు తీసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులైన వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించారు.
బాధితుడు తుకారాం రౌత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులైన సంజయ్, రాజేంద్రలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పోలీసులు దానిపై విచారణ వేగవంతం చేశారు. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులపైనే కర్కశంగా దాడి చేసిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని రేకెత్తించింది.

Leave a Reply