జపాన్లోని ప్రసిద్ధ ‘మౌంట్ ఫుజి’ పర్వతారోహణ సమయంలో అలసిపోయిన తన 7 ఏళ్ల కుమారుడిని మార్గమధ్యంలోనే ఒంటరిగా వదిలేసి, పెద్ద కుమారుడితో కలిసి తండ్రి శిఖరం వైపు వెళ్లిన దిగ్భ్రాంతికర ఘటన తీవ్ర కలకలం రేపింది.
నగోయా ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు కుమారులు, ఓ స్నేహితుడితో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పర్వతంలోని 6వ బేస్ క్యాంప్ వద్ద సుమారు 8,169 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు, 7 ఏళ్ల చిన్న కొడుకు తనకు బాగా అలసటగా ఉందని చెప్పాడు. దీంతో ప్రయాణాన్ని మధ్యలోనే ఆపడం ఇష్టంలేని తండ్రి, ఆ చిన్నారిని అక్కడే బెంచీపై కూర్చొని వేచి ఉండమని చెప్పి, పెద్ద కుమారుడితో కలిసి శిఖరం వైపు వెళ్లిపోయాడు.
వారు వెళ్లిన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో వాతావరణం క్షీణించి భారీ వర్షం, మంచు కురవడం మొదలైంది. గడ్డకట్టే చలిలో ఆ చిన్నారి ఒంటరిగా బెంచీపై వణుకుతూ కూర్చుని ఉండటాన్ని చూసిన సమీప లాడ్జి సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే బాలుడిని సురక్షిత ప్రాంతానికి చేర్చి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు తండ్రిని ఫోన్ ద్వారా సంప్రదించి గట్టిగా హెచ్చరించడంతో పాటు, అతడిని వెంటనే వెనక్కి రప్పించి బాలుడిని అప్పగించారు. ప్రాణాపాయం ఉండే అత్యంత ప్రతికూల వాతావరణంలో చిన్న పిల్లాడిని ఒంటరిగా వదిలేసినందుకు తండ్రి తన తప్పును అంగీకరిస్తూ అధికారులకు క్షమాపణలు చెప్పాడు.
పర్వతారోహణకు వెళ్లేవారు తమ వెంట ఉన్న ప్రతి ఒక్కరి శారీరక దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ముందుకు సాగాలని, గ్రూప్లో ఎవరైనా అలసిపోతే ప్రయాణ వేగాన్ని తగ్గించుకోవడమో లేదా ట్రెక్ను విరమించుకోవడమో చేయాలని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply