అమెరికాలోని ప్రముఖ న్యూయార్క్ నగరంలో గల టైమ్స్ స్క్వేర్ ప్రాంతంలో రెండు కత్తులు పట్టుకుని తిరుగుతూ ప్రజలపై విచక్షణారహితంగా దాడికి తెగబడిన ఒక మహిళను పోలీసులు కాల్చిచంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సోమవారం నాడు చేతుల్లో రెండు కత్తులతో టైమ్స్ స్క్వేర్ ప్రాంతానికి చేరుకున్న ఒక మహిళ, ఉన్నట్టుండి అక్కడున్న సాధారణ ప్రజలపై దాడికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో, మహిళా పోలీసు అధికారితో సహా 5 నుంచి 6 మంది పోలీసులు ఆ మహిళను చుట్టుముట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. చేతిలో ఆయుధాలు ఉన్న ఆ మహిళ పోలీసులను సైతం బెదిరిస్తూ తీవ్ర ఉద్రిక్తత సృష్టించడమే కాకుండా, అకస్మాత్తుగా కత్తులతో ఒక పోలీసు అధికారిపైకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపారు. మూడు రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించగానే ఆ మహిళ నడిరోడ్డుపై కుప్పకూలిపోయింది. ఈ ఆపరేషన్ అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ ఘటనపై న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మాట్లాడుతూ.. టైమ్స్ స్క్వేర్లో ప్రజలపై దాడికి దిగిన మహిళను అదుపు చేసేందుకు పోలీసులు తొలుత ‘టేజర్’ (షాక్ ఇచ్చే ఆయుధం) ఉపయోగించారని, అయితే పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆత్మరక్షణార్థం కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు.
పెను విపత్తు జరగకుండా అడ్డుకున్న పోలీసులను మేయర్ అభినందించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక అమాయకుడితో పాటు కాల్పుల్లో నిందితురాలైన మహిళ మృతి చెందారని, గాయపడ్డ మరో వ్యక్తి ప్రస్తుతం ఐసీయూలో నిలకడగా చికిత్స పొందుతున్నారని ఆయన ధ్రువీకరించారు.
ఈ ఘటనపై పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన టైమ్స్ స్క్వేర్లోని ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్, దర్యాప్తు బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
ప్రాథమిక విచారణ ప్రకారం ఇది ఉగ్రవాద దాడి కాకపోవచ్చని భావిస్తున్నప్పటికీ, ఆ మహిళ ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టింది అనేదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మృతి చెందిన మహిళ వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Leave a Reply