బీజింగ్: చైనా చరిత్రలో దాదాపు 276 సంవత్సరాల పాటు నిరంకుశంగా పాలించిన ‘మింగ్ సామ్రాజ్యం’ (Ming Dynasty) ఎలా పతనమైంది? అనే ప్రశ్నకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లోకెల్లా ఒక అతిపెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ (శాస్త్రీయ పరిశోధన) వెలుగులోకి వచ్చింది. పాత సిద్ధాంతాల ప్రకారం.. బలహీనమైన పాలకులు, అవినీతి మాత్రమే ఈ సామ్రాజ్య పతనానికి కారణాలని భావించేవారు.
కానీ, ‘క్లైమేట్ ఆఫ్ ది పాస్ట్’ (Climate of the Past) జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం అందరినీ షాక్కు గురిచేస్తోంది. పరిశోధకుల ప్రకారం.. డిసెంబర్ 1640లో ఫిలిప్పీన్స్ దక్షిణ భాగంలో ఉన్న ‘మౌంట్ పార్కర్’ అనే అగ్నిపర్వతం అత్యంత భయంకరంగా బద్దలైంది. ఈ ప్రకృతి విపత్తు చైనాలో అప్పటికే ఉన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని కొన్ని వందల రెట్లు పెంచేసింది. అగ్నిపర్వతం నుండి వెలువడిన దట్టమైన పొగ సూర్యరశ్మిని భూమికి చేరకుండా అడ్డుకుంది. దీనివల్ల తూర్పు ఆసియాలో రుతుపవనాల వ్యవస్థ (మాన్సూన్ సిస్టమ్) పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా ఉత్తర చైనాలో తీవ్రమైన కరవు ఏర్పడి, పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ వినాశకర వాతావరణం దేశంలో ఆకలి చావులకు, ప్రజల తిరుగుబాటుకు దారితీసి.. మింగ్ సామ్రాజ్యం పూర్తిగా కూకటివేళ్లతో కూలిపోయేలా చేసింది.
1644లో బీజింగ్ ఆక్రమణకు కేవలం తిరుగుబాటు సైన్యమే కారణమా?
చారిత్రక రికార్డుల ప్రకారం.. క్రీ.శ. 1644లో ‘లీ జిచెంగ్’ నాయకత్వంలోని తిరుగుబాటు సైన్యం బీజింగ్ను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత మింగ్ సామ్రాజ్యపు చివరి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఈ తిరుగుబాటు వెనుక ఉన్న అసలు శక్తులు వాతావరణ మార్పులేనని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. ఫిలిప్పీన్స్ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల గాల్లోకి భారీ మొత్తంలో ‘సల్ఫేట్ ఏరోసోల్స్’ విడుదలయ్యాయి. ఇది గ్లోబల్ కూలింగ్ (భూమి ఉష్ణోగ్రత పడిపోవడం)కు దారితీసి, ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోయేలా చేసింది. ఈ అతి శీతల వాతావరణం వ్యవసాయాన్ని పూర్తిగా అతలాకుతలం చేసింది. దాంతో రాజు వద్ద తన సైన్యానికి ఇవ్వడానికి డబ్బు గానీ, ఆహార ధాన్యాలు గానీ మిగలలేదు. ఈ విధంగా ఒక ప్రకృతి విపత్తు.. తిరుగుబాటు సైన్యం యొక్క పనిని మరింత సులువు చేసింది.
మింగ్ సామ్రాజ్యానికి ‘స్ట్రెస్ మల్టిప్లైయర్’గా మారిన అగ్నిపర్వతం!
ఈ సరికొత్త అధ్యయనంలో శాస్త్రవేత్తలు గతంలో సంభవించిన పెద్ద పెద్ద అగ్నిపర్వత విస్ఫోటనాలు మరియు గ్లోబల్ ఉష్ణోగ్రతల డేటాను విశ్లేషించారు. అప్పట్లో సంభవించిన పెద్ద విస్ఫోటనాలు ఎల్లప్పుడూ అప్పటికే స్థిరపడిన వ్యవస్థలకు ‘స్ట్రెస్ మల్టిప్లైయర్’ (ఒత్తిడిని లేదా సమస్యలను తీవ్రం చేసే సాధనం)గా మారాయని వారు కనుగొన్నారు. మింగ్ సామ్రాజ్యం అప్పటికే వెండి కొరతతో పాటు, ఈశాన్య సరిహద్దుల్లో శత్రు సైన్యాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో మౌంట్ పార్కర్ విస్ఫోటనం ‘ఆజ్యానికి నెయ్యి తోడైనట్లు’ పనిచేసింది. పార్కర్ విస్ఫోటనం కారణంగా సుదీర్ఘమైన, అత్యంత కఠినమైన కరవు ఏర్పడిందని, ఈ కరవు మింగ్ డైనస్టీ యొక్క ఆహార భద్రతా వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని పరిశోధకులు తమ నివేదికలో రాశారు.
చైనాలోని ఇతర సామ్రాజ్యాల పతనానికి కూడా ఇదే కారణమా?
ఈ పరిశోధన గత రెండు వేల సంవత్సరాల చైనా చరిత్రపై ఒక సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. పాత డేటాను పరిశీలిస్తే.. చైనాలోని చాలా పెద్ద పెద్ద రాజవంశాల పతనానికి అగ్నిపర్వత విస్ఫోటనాలతో ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తోంది. పర్యావరణంలో అకస్మాత్తుగా మార్పులు వచ్చినప్పుడల్లా అక్కడ పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాట్లు జరిగాయి. ఆహార కొరత ఏర్పడటంతో ఆకలితో అలమటించిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురుతిరగడానికి దారితీసింది.

Leave a Reply