పిల్లలకు స్వల్ప జ్వరం లేదా జలుబు వస్తే వెంటనే భయపడాల్సిన అవసరం లేనప్పటికీ, కొన్ని కీలకమైన లక్షణాలను తల్లిదండ్రులు ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు (పీడియాట్రీషియన్) డాక్టర్ కె. రావణన్ (MD) స్పష్టం చేస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (ఆయాసం), తీవ్రమైన నీరసం/అలసట, నిరంతరం వాంతులు కావడం, డీహైడ్రేషన్ (శరీరంలో నీటిశాతం తగ్గడం), ఫిట్స్ (మూర్ఛ), స్పృహ కోల్పోవడం, ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు.. ఈ 7 ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
నేటి ఆధునిక పిల్లల వైద్యం అనేది కేవలం రోగం వచ్చాక మందులు ఇవ్వడానికే పరిమితం కాలేదు. వ్యాధులు రాకుండా నివారించడం, సకాలంలో వ్యాక్సిన్లు (టీకాలు) వేయించడం, పౌష్టికాహారం, తల్లిపాలు అందించడం, శుభ్రమైన తాగునీటిని అందించడం ద్వారా పిల్లల సమగ్ర ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడటమే దీని ప్రధాన లక్ష్యం.
అనారోగ్యం పాలైనప్పుడు మాత్రమే ఆసుపత్రికి వెళ్లాలని లేదు; పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారి శారీరక ఎదుగుదల పర్యవేక్షణ (గ్రోత్ మానిటరింగ్) కోసం వైద్యులను సంప్రదించవచ్చు. అంతేకాకుండా ఎమ్మారై (MRI), సిటీ స్కాన్ (CT Scan), రక్త పరీక్షల వంటి పరీక్షలను వైద్యుల సిఫార్సు లేకుండా సొంత నిర్ణయాలతో అనవసరంగా చేయించకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు.
పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అత్యంత కీలకమైనది. పిల్లల్లో కనిపించే భయం, ఆందోళన, నిద్రలేమి, ప్రవర్తనా మార్పులను ‘పిల్లలే కదా’ అని కొట్టిపారేయకూడదు. శరీరంతో పాటు మనస్సు సమతుల్యంగా ఉన్నప్పుడే పిల్లల సంపూర్ణ వికాసం సాధ్యమవుతుంది.
పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమైనది. గతంలో వచ్చిన అనారోగ్యాలు, అలర్జీల (ఒగ్గకపోవడం) వివరాలను వైద్యులకు స్పష్టంగా వివరించాలి. అలాగే ఇంటర్నెట్లో వచ్చే సమాచారాన్ని చూసి సొంత వైద్యం చేసుకోవడం లేదా చికిత్సను మార్చడం మానుకుని, నిపుణులైన వైద్యుల సలహాలను కచ్చితంగా పాటించడమే పిల్లల ఆరోగ్యానికి సురక్షితం.

Leave a Reply