మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన సహజసిద్ధమైన నటనతో తమిళం, కన్నడ, హిందీ భాషా ప్రేక్షకులను అలరించిన నటి పార్వతి తిరువోతు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
తమిళంలో ‘పూ’, ‘మరియాన్’, మరియు ఇటీవల విక్రమ్ సరసన వచ్చిన ‘తంగలాన్’ వంటి చిత్రాల ద్వారా ఈమె తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కేవలం కమర్షియల్, గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథకు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో ఆమె రూటే వేరు. నటిగానే కాకుండా సమాజంలో మహిళలపై, వెనుకబడిన వర్గాలపై జరిగే అన్యాయాలపై నిరంతరం గళమెత్తే సామాజిక కార్యకర్తగా కూడా పార్వతికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
అన్యాయాన్ని ప్రశ్నించినందుకు చంపేస్తామంటూ బెదిరింపులు:
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న పార్వతి.. తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను, సవాళ్లను బహిరంగంగా పంచుకున్నారు. ముఖ్యంగా, 2017లో కేరళలో ఒక ప్రముఖ నటిపై జరిగిన దాడి, కిడ్నాప్ ఉదంతం తర్వాత.. చిత్ర పరిశ్రమలో మహిళల భద్రత గురించి ఆమె గట్టిగా మాట్లాడటం ప్రారంభించారు.
“నేను చేసిందేదో పెద్ద ఘనకార్యం కాదు; ఒక బాధ్యతగల మనిషిగా చేయాల్సిన కనీస పనిని మాత్రమే చేశాను” అని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇలా అన్యాయాన్ని ఎదిరించినందుకు తనకు వరుసగా హత్యా బెదిరింపులు, లైంగిక వేధింపుల (రేప్) బెదిరింపులు వచ్చాయని ఆమె అత్యంత ఆవేదనతో వెల్లడించారు.
అవకాశాలు కోల్పోయినా వెనకడుగు వేయలేదు:
సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటీనటులు తమకు వచ్చే సినిమా అవకాశాలు ఎక్కడ చేజారిపోతాయోననే భయంతో అనేక విషయాల్లో మౌనం వహిస్తుంటారు. కానీ, పార్వతి మాత్రం తన రాజకీయ, సామాజిక సిద్ధాంతాల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. దీనివల్ల తాను ఎన్నో పెద్ద పెద్ద సినిమా అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.
“నా కోసం కొన్ని తలుపులు మూసుకుపోయినప్పుడే నాకు అర్థమైంది, ఆ అవకాశాలు నా కోసం వచ్చినవి కావు అని” అంటూ పార్వతి సెలవిచ్చారు. ఎంతటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, తన గొంతును నొక్కేయాలని చూసిన వారి ముందు ఆమె అస్సలు తగ్గకుండా ఎంతో హుందాగా, ధైర్యంగా నిలబడ్డారు.
కుటుంబమే కొండంత అండ:
తన చుట్టూ ఎన్నో వ్యతిరేకతలు, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ నడుస్తున్నప్పటికీ.. తన కుటుంబం, స్నేహితులు ఇచ్చిన మద్దతే తనను ముందుకు నడిపించిందని పార్వతి ఎమోషనల్ అయ్యారు. తన అమ్మ, నాన్న, సోదరుడు మరియు కొందరు మహిళా స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన సపోర్ట్ సిస్టమ్ తనకు ఒక రక్షణ కవచంలా నిలిచిందని ఆమె తెలిపారు. ప్రస్తుత డిజిటల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశంగా మారిన పార్వతి ధైర్యమైన ప్రసంగాన్ని చూసి నెటిజన్లు, అభిమానులు “అందరూ మౌనంగా ఉన్నప్పుడు మాట్లాడే ధైర్యం చేసిన ఏకైక నటి పార్వతి” అంటూ ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.

Leave a Reply