మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా నగరంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పనా మిశ్రా (25) అనే వివాహిత, ఆమె పసికందు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
కాన్పుకు కొన్ని గంటల ముందు కల్పనా మిశ్రా ఏడుస్తూ రికార్డ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె, “నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి.. నేను బతకను, నన్ను వీళ్లు చంపేస్తారు” అని కన్నీరుమున్నీరవుతూ తన భయాన్ని వ్యక్తం చేసిన తీరు అందరినీ కలచివేస్తోంది.
గత మంగళవారం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో చేరిన కల్పనకు మరుసటి రోజు సిజేరియన్ ద్వారా డెలివరీ జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమెతో పాటు నవజాత శిశువు కూడా చికిత్స పొందుతూ మరణించారు.
సకాలంలో సరైన వైద్యం అందించలేదని, వైద్యులు మరియు నర్సులు తనతో చాలా దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబసభ్యులు తీవ్ర నిర్లక్ష్యపు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు ఆసుపత్రి గేటు ఎదుట బైఠాయించి తీవ్ర ఆందోళన చేపట్టారు.
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఆసుపత్రి డీన్ సునీల్ అగర్వాల్, సూపరింటెండెంట్ రాహుల్ మిశ్రా ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబంతో మాట్లాడారు. ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
ప్రాథమిక చర్యగా విధుల్లో ఉన్న ఇద్దరు నర్సింగ్ అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు, ఈ మరణాలపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే తల్లీబిడ్డల మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.
మంగవాన్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర ప్రజాపతి కూడా ఆసుపత్రిని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వైద్య అధికారులతో మాట్లాడిన ఆయన, విచారణలో ఎవరి తప్పిదం తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రిలోనే గర్భిణి, పుట్టిన బిడ్డ వరుసగా ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది.

Leave a Reply