ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరయ్యా జిల్లా దిబియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫఫూంద్ జంక్షన్లో అంకిత్ అనే ఈ-రిక్షా డ్రైవర్, తన భార్య మీనా దేవికి మందులు తీసుకురావడానికి వెళ్తున్నాడు.
ఆ సమయంలో అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారంటూ అతని ఈ-రిక్షాకు చలానా విధించారు.
కాసేపటికే అంకిత్ మొబైల్ ఫోన్కు ఏకంగా రూ.14,000 భారీ జరిమానా విధించినట్లు మెసేజ్ వచ్చింది. రోజుకు వచ్చే అరకొర ఆదాయంతో బతికే అంకిత్.. అంత పెద్ద మొత్తాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఫఫూంద్ జంక్షన్కు తిరిగి వచ్చి, నడిరోడ్డుపై పడుకుని గుండెలవిసేలా ఏడుస్తూ నిరసనకు దిగాడు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న దిబియాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్యప్రకాష్.. అంకిత్తో మాట్లాడి అతడిని ఓదార్చి రోడ్డుపై నుంచి పైకి లేపారు. ఏ ట్రాఫిక్ పోలీసులు, ఏ నిబంధనల కింద ఇంత భారీ జరిమానా విధించారనే దానిపై సమగ్ర విచారణ జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply