కుషీనగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషీనగర్ జిల్లా పిప్రాఘాట్ గ్రామంలో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టిన ఒక దారుణ ‘గౌరవ హత్య’ (Honor Killing) ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాము ప్రేమించిన యువకులను వదులుకోలేమంటూ వారితో నిరంతరం ఫోన్లలో మాట్లాడుతున్న లాలీ (20), షీలా (18) అనే ఇద్దరు యువతులను (సొంత అక్కాచెల్లెళ్లను) వారి కన్నతండ్రే అర్ధరాత్రి వేళ గదిలో బంధించి, తన కుమారులతో కలిసి లాఠీలు, కర్రలతో కొట్టి కొడూరంగా హతమార్చాడు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘోర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఊరి పంచాయితీ హెచ్చరికలు
మరణించిన ఇద్దరు సోదరిమణులు గత ఏడాది అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను ప్రేమించి వారితో కలిసి ఇల్లు వదిలి పారిపోయారు. అయితే, ఆరు నెలల క్రితం వారు మళ్లీ ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఇకపై ప్రియులతో మాట్లాడకూడదని, ఊరి పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
అర్ధరాత్రి వేళ దారుణం
అయినప్పటికీ, జూన్ 8 అర్ధరాత్రి వేళ ఆ ఇద్దరు యువతులు తమ ప్రియులతో రహస్యంగా మొబైల్ ఫోన్లో మాట్లాడుతుండగా తండ్రి రాంప్రసాద్ కంటపడ్డారు. తీవ్ర ఆగ్రహంతో వారి వద్ద నుండి ఫోన్ లాక్కున్న అతడు, క్షణికావేశంలో తన ఇద్దరు కుమారులను కూడా తోడు తెచ్చుకున్నాడు.
కన్నకూతుళ్లు రక్తపు మడుగులో తల్లడిల్లుతూ ప్రాధేయపడుతున్నా వదలకుండా, చనిపోయే వరకు కర్రలతో పశువులను బాదినట్లు బాది చంపేశారు. అనంతరం ముగ్గురూ అక్కడి నుండి పరారయ్యారు.
ఇద్దరు మైనర్లు అదుపులోకి..
గ్రామ కాపలాదారు (వాచ్మన్) ఇచ్చిన సమాచారంతో అడిషనల్ ఎస్పీ సిద్ధార్థ్ వర్మ నేతృత్వంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో పడి ఉన్న యువతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ దారుణ హత్యతో సంబంధం ఉన్న ఇద్దరు మైనర్లను (రాంప్రసాద్ కుమారులు) పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు తండ్రి రాంప్రసాద్ కోసం గాలిస్తున్నారు.
కేవలం ప్రేమించారనే ఏకైక కారణంతో కన్నతండ్రే కూతుళ్లను ఇంత కొడూరంగా చంపిన ఈ అమానుష ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఈ వార్త నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Leave a Reply