జమ్ముకశ్మీర్లోని దోడా ప్రాంతంలో ఉన్న ఓ ఎత్తైన వంతెనపైకి ఓ యువతి హఠాత్తుగా ఎక్కి నిలబడి కేకలు వేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఆ మార్గంలో వెళ్తున్నవారు అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే పరిస్థితి చేతులు దాటిపోయింది. అక్కడున్న కొందరు ఆమెను సమీపించి వారించేందుకు ప్రయత్నించినప్పటికీ, తన దగ్గరికి ఎవరైనా వస్తే నదిలోకి దూకేస్తానంటూ ఆమె హెచ్చరించింది. దీంతో భయపడిన జనం కాస్త దూరంలోనే నిలబడి చూడాల్సి వచ్చింది.
కొద్ది నిమిషాల పాటు వంతెన అంచుపైనే నిలబడిన ఆ యువతి.. ఒక్కసారిగా అక్కడున్న వారివైపు చూస్తూ “బై-బై నాన్నా” అని అరుస్తూ కింద ఉధృతంగా ప్రవహిస్తున్న చీనాబ్ నదిలోకి దూకేసింది. కనురెప్పపాటులో జరిగిన ఈ ఘోరాన్ని చూసిన జనం ఏం చేయాలో పాలుపోక నిశ్చేష్టులై ఉండిపోయారు. ఈ విషాదకర సంఘటన తాలూకు ఒళ్లు గగుర్పొడిచే వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత ప్రమాదకర స్థితిలో ఓ యువతి నిలబడి ఉండటాన్ని చూసి కూడా.. వెంటనే పోలీసులకో, సహాయక బృందాలకో సమాచారం అందించాల్సింది పోయి, కేవలం సోషల్ మీడియాలో పోస్టుల కోసమే వీడియోలు తీస్తూ ఉండిపోయిన జనం తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మానసిక ఒత్తిడి లేదా ఇతరత్రా కుటుంబ సమస్యలతో సతమతమయ్యే వారిని సకాలంలో గుర్తించి కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఎంతైనా ఉందనే విషయాన్ని ఈ విషాదం గుర్తుచేస్తోంది.

Leave a Reply