తిరుప్పూర్: తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా అవినాశి సమీపంలో గల చేయూర్ గ్రామంలో మద్యం మత్తు కారణంగా జరిగిన ఒక కుటుంబ గొడవ, ఇంటర్ చదువుతున్న ఒక నిరుపేద విద్యార్థిని ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘోర కలికాలపు సంఘటన స్థానిక ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అవినాశి సమీపంలోని చేయూర్ ప్రాంతానికి చెందిన రవిచంద్రన్ (45) చిన్న కుమార్తె రితికా (17). ఈమె స్థానిక పాఠశాలలో ఇంటర్మీడియట్ (ప్లస్-2) చదువుతోంది. రవిచంద్రన్ ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి రావడం అలవాటు. నిన్న అర్ధరాత్రి కూడా ఆయన ఎప్పటిలాగే విపరీతంగా మద్యం సేవించి, మత్తు తలకెెక్కిన స్థితిలో ఇంటికి చేరుకున్నాడు. భర్త నిరంతరం తాగుడుకు బానిస కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతని భార్య, రవిచంద్రన్ను ఇంటి వాకిట్లోనే నిలదీసి గట్టిగా మందలించింది.
దీంతో అర్ధరాత్రి వేళ దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తీవ్ర ఆగ్రహానికి లోనైన రవిచంద్రన్, “నేను ఆత్మహత్య చేసుకుంటాను” అని గట్టిగా అరుస్తూ, ఇంటి సమీపంలోనే ఉన్న 100 అడుగుల లోతైన ఎండిపోయిన బావి వైపు వేగంగా పరుగెత్తాడు.
తండ్రి ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి..
కనురెప్పపాటు కాలంలో తండ్రి బావిలోకి దూకడానికి పరుగెత్తడం చూసి భయాందోళనకు గురైన చిన్న కుమార్తె రితికా, ఎలాగైనా కన్నతండ్రి ప్రాణాలు కాపాడాలనే ఆరాటంతో అతని వెనుకాలే పరుగెత్తింది. అర్ధరాత్రి సమయం కావడం, చుట్టూ తగినంత వెలుతురు లేక చీకటిగా ఉండటంతో.. పరిగెడుతున్న తండ్రిని పట్టుకుని వెనక్కి లాగే ప్రయత్నంలో రితికా అదుపుతప్పింది. దురదృష్టవశాత్తూ కాలుజారి 100 అడుగుల లోతైన ఆ ఎండిపోయిన బావిలోకి తలకిందులుగా పడిపోయింది.
ఎండిపోయి, రాళ్లతో నిండిన ఆ వంద అడుగుల లోతు బావిలో పడటంతో రితికా తలకు, శరీరానికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే విగతజీవిగా మారింది. కండ్లముందే కన్నకూతురు బావిలో పడి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారి అరుపులు విని పరుగున వచ్చిన చుట్టుపక్కల ప్రజలు వెంటనే చేయూర్ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది బావిలోకి దిగి, తీవ్ర శ్రమకోర్చి విద్యార్థిని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనపై అవినాశి మరియు చేయూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మద్యం మత్తు తెచ్చిన ముప్పుతో, తండ్రిని కాపాడబోయిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని బావిలో పడి మృతి చెందడం ఆ ప్రాంతంలో తీవ్ర శోకాన్ని నింపింది.

Leave a Reply