ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన చందాదారుల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పలు రకాల పింఛను పథకాలను అమలు చేస్తోంది.
ముఖ్యంగా, ఒక ఉద్యోగి తన సర్వీసు కాలంలో కనీసం 10 సంవత్సరాలు నిరంతరంగా ఈపీఎఫ్ఓ పథకంలో భాగస్వామ్యమై ఉంటే చాలు.. 58 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత జీవితాంతం నెలవారీ పెన్షన్ పొందేందుకు అర్హత సాధిస్తారు.
ప్రైవేట్ రంగంలో పనిచేసే ఎంతోమంది ఉద్యోగులు 10 ఏళ్లకు పైగా పనిచేసినప్పటికీ తమకు పెన్షన్ వస్తుందా లేదా అనే గందరగోళంలో ఉన్న సమయంలో, ఈ 10 ఏళ్ల సర్వీసు నిబంధన వారికి కొండంత భరోసానిస్తోంది.
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Salary) మరియు కరవు భత్యం (DA) నుంచి 12% మొత్తం పీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. అదేవిధంగా, యాజమాన్యం (కంపెనీ) కూడా 12% మొత్తాన్ని జమ చేస్తుంది.
కంపెనీ జమ చేసే 12% వాటాలో 8.33% మొత్తం ఉద్యోగుల పెన్షన్ పథకానికి (EPS), మిగిలిన 3.67% మొత్తం పీఎఫ్ (EPF) ఖాతాకు కేటాయిస్తారు. దీనివల్ల ఉద్యోగుల పెన్షన్ ఫండ్ క్రమంగా పెరుగుతూ, వారు పదవీ విరమణ చేసినప్పుడు గౌరవప్రదమైన నెలవారీ పెన్షన్ లభిస్తుంది.
ఉదాహరణకు, ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 15,000 అనుకుంటే, అతనికి పెన్షన్ ఎలా లెక్కిస్తారో చూద్దాం. ఈపీఎఫ్ఓ పెన్షన్ ఫార్ములా ప్రకారం.. రూ. 15,000 బేసిక్ పేతో ఒకరు 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే, అతనికి నెలకు సుమారు రూ. 2,142 వరకు పెన్షన్ అందే అవకాశం ఉంది.
అదే ఒకవేళ 30 ఏళ్ల పాటు సర్వీసు అందిస్తే, పెన్షన్ మొత్తం గణనీయంగా పెరిగి నెలకు రూ. 6,428 వరకు లభిస్తుంది. కాబట్టి 10 ఏళ్ల పాటు నిరంతర సర్వీసును పూర్తి చేసుకోవడం మీ రిటైర్మెంట్ జీవితానికి శాశ్వత ఆర్థిక భద్రతను అందిస్తుంది.

Leave a Reply