చెన్నైలోని కోవిలంబక్కంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలైన భువనేశ్వరి (27) అదనపు కట్నం వేధింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.
ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న భువనేశ్వరికి 2024 సెప్టెంబర్లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో దాదాపు 50 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల విలువైన కారుతో పాటు వరుడికి మరో 20 తులాల బంగారాన్ని కట్నకానుకలుగా ముట్టజెప్పారు.
అయినప్పటికీ, పెళ్లయిన కొద్ది నెలల నుంచే అదనపు కట్నం తేవాలంటూ భువనేశ్వరిని ఆమె భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. ఇటీవల వీరి ఏడాది బాబు మొదటి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ సందర్భంగా భువనేశ్వరి తల్లిదండ్రులు బాబుకు బంగారు గొలుసు బహూకరించగా, ఈ విషయమై అత్తింట్లో మళ్లీ తీవ్ర వివాదం చెలరేగింది. ఈ క్రమంలో పెళ్లయిన రెండేళ్లకే, ఏడాది బాబును ఒంటరిని చేస్తూ భువనేశ్వరి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై భువనేశ్వరి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివాహమైన ఏడేళ్ల లోపే ఈ అనుమానాస్పద మృతి సంభవించడంతో చట్టప్రకారం ఆర్డీవో (RDO) విచారణకు కూడా ఆదేశించారు. వరకట్న మహమ్మారికి మరో విద్యావంతురాలైన యువ ఉపాధ్యాయురాలు బలికావడం స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తిస్తోంది.

Leave a Reply