సికింద్రాబాద్: తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తన బామ్మతో కలిసి నిద్రిస్తున్న 5 ఏళ్ల బాలుడు నిఖిల్ కిడ్నాప్ అయ్యాడు. 12 రోజుల తర్వాత ఆ బాలుడిని కిడ్నాపరే స్వయంగా పోలీస్ స్టేషన్కు తీసుకురావడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కిడ్నాపర్ చెప్పిన వింత కారణం: బాలుడు కనిపించకుండా పోవడంతో, సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. దాదాపు 12 రోజుల తర్వాత షేక్ మెహబూబ్ అలీ అనే వ్యక్తి నిఖిల్ను తీసుకుని పోలీసుల వద్దకు వచ్చాడు. “జూన్ 29న బాలుడు ఒంటరిగా కనిపించాడు, అతనికి తీవ్ర జ్వరం ఉండటంతో హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయించాను, కొత్త బట్టలు కొనిచ్చాను” అని ఆ వ్యక్తి పోలీసులకు చెప్పాడు.
పోలీసుల అనుమానం: అయితే, సిసిటివి దృశ్యాల్లో ఆ వ్యక్తి బాలుడిని తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి, అతను చెప్పే మాటలను పోలీసులు నమ్మడం లేదు. నిందితుడు ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. అసలు అతను బాలుడిని ఎందుకు తీసుకెళ్లాడు? అతని అసలు ఉద్దేశ్యం ఏంటి? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలుడు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ బాలుడిని పోలీసులు తల్లికి అప్పగించారు.

Leave a Reply