న్యూఢిల్లీ: 15 ఏళ్ల ప్రతిభావంతుడైన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి విశ్రాంతి ఇచ్చే బదులు, నిరంతరం ఆడే అవకాశం కల్పించాలని భారత మాజీ లెగ్ స్పిన్నర్ ఎల్. శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల అతను వివిధ పరిస్థితులను అర్థం చేసుకుంటూ, తన తప్పుల నుండి నేర్చుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇంగ్లాండ్తో మాంచెస్టర్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో 15 ఏళ్ల 99 రోజుల వయస్సులో భారత్ తరఫున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ నిలిచారు. తన మొదటి మ్యాచ్లోనే 10 బంతుల్లో రెండు సిక్సర్లతో 14 పరుగులు చేశారు.
1983లో 17 ఏళ్ల వయస్సులోనే టెస్టుల్లో అరంగేట్రం చేసిన శివరామకృష్ణన్ మాట్లాడుతూ, టీమ్ మేనేజ్మెంట్ సూర్యవంశీపై నమ్మకం ఉంచినప్పుడు, అతనికి తగినన్ని అవకాశాలు ఇవ్వాలని చెప్పారు. ‘పీటీఐ’తో మాట్లాడుతూ, “పరిమిత ఓవర్ల క్రికెట్లో అతనికి నిరంతరం అవకాశాలు రావాలి. యువ ఆటగాడిని జట్టులోకి తీసుకుని మళ్ళీ విశ్రాంతి ఇచ్చే పద్ధతి అర్థరహితం. అతనికి ఇప్పుడు విశ్రాంతి అవసరం లేదు, ఏడాది పొడవునా ఆడాలి” అని పేర్కొన్నారు.
“ఒక బ్యాటర్గా అతనికి బౌలర్ల తరహా ఫిట్నెస్ మేనేజ్మెంట్ అవసరం ఉండదు. ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయడం వల్ల అతని ఏకాగ్రత, మానసిక దృఢత్వం పెరుగుతాయి. అతన్ని ఆడించాలని ఒకసారి నిర్ణయించుకున్నాక, పూర్తి అవకాశాలు ఇవ్వాలి. అతను రాబోయే 20 ఏళ్ల భారత క్రికెట్ భవిష్యత్తు. ప్రస్తుతం సూర్యవంశీకి కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరియు జట్టులోని ఇతర ఆటగాళ్ల మద్దతు ఎంతో అవసరం. ఆరంభంలో కొన్ని మ్యాచ్ల్లో రాణించకపోయినా, అతనికి పూర్తి మద్దతునిస్తూ అవకాశాలు ఇవ్వాలి” అని శివరామకృష్ణన్ అన్నారు.
సూర్యవంశీ సహజంగానే దూకుడుగా ఆడే బ్యాటర్ అని, ఆధునిక క్రికెట్లో రిస్క్ తీసుకోవడం సహజమని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి అతని సహజశైలిని మార్చుకోమని చెప్పకూడదని సూచించారు. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. సూర్యవంశీ వంటి అసాధారణ ప్రతిభావంతుడికి వన్డే క్రికెట్లో కూడా అవకాశం లభించాలని, వచ్చే ఏడాది జరిగే 50 ఓవర్ల ప్రపంచకప్కు అతను టాప్ ఆర్డర్లో మంచి బ్యాటర్గా ఎదగగలడని శివరామకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply