బంగ్లాదేశ్లోని రంగ్పూర్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
రిటైర్డ్ స్కూల్ టీచర్ గణపతి చక్రవర్తి, ఆయన భార్య ప్రీతీలత, కుమార్తె ఆగమి, 12 ఏళ్ల కుమారుడు ప్రియం తమ నివాసంలో విగతజీవులుగా పడి ఉండటం కలకలం రేపింది. తాళం వేసి ఉన్న ఇంటి లోపల కుటుంబ సభ్యుల మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.
దర్యాప్తు సమయంలో ఘటనా స్థలంలో దొరికిన కొన్ని ఆధారాలు పోలీసుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా సగం తిని వదిలేసిన దోసకాయ ముక్క, కాలిపోయిన గాజులు వంటి కీలక ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయి. అంతేకాకుండా, ఈ ఘోరం జరిగిన తర్వాత దుండగులు అదే ఇంట్లో కొన్ని గంటల పాటు గడిపి ఉండవచ్చని విచారణలో వెల్లడైంది. ఈ ఆధారాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. తమ ఇంటి మేడపై (టెర్రస్పై) కొందరు ఆకతాయిలు డ్రగ్స్ (మత్తుపదార్థాలు) సేవించడాన్ని సదరు కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారని, ఆ కారణంగానే వారి మధ్య గొడవలు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ హత్యలకు గల పూర్తి కారణాలు, నేపథ్యంపై అధికారిక విచారణ కొనసాగుతోంది. వివిధ కోణాల్లో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులతో పాటు నేర పరిశోధన విభాగం (CID), నిఘా వర్గాలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, నివేదిక వెలువడిన తర్వాతే ఈ మిస్టరీ హత్యల అసలు గుట్టు వీడే అవకాశముంది.

Leave a Reply