“10 రోజుల్లో ఛిన్నాభిన్నమైన కుటుంబం..!” నలుగురు చిన్నారులు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందిన విషాదం.. నది నీటితో వచ్చిన విపత్తా..? వైద్య లోకాన్ని భయపెడుతున్న కొత్త మిస్టరీ వ్యాధి..!!!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు ఒకరి వెనుక ఒకరు అంతుచిక్కని వ్యాధితో ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.

కేవలం 10 రోజుల వ్యవధిలోనే చోటుచేసుకున్న ఈ వరుస మరణాలు స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

గత ఆగస్టు 16న సింధు నదిలో స్నానం చేసి వచ్చిన 14 ఏళ్ల తాహిర్ ఖాన్‌ తీవ్ర జ్వరం, కడుపునొప్పి, వాంతులతో బాధపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫలితం లేక ఆగస్టు 21న అతడు మరణించాడు. ఆ తర్వాత అతని బంధువైన 19 ఏళ్ల అయాస్, అలాగే సోదరులైన 11 ఏళ్ల తారూఫ్, 9 ఏళ్ల తాసిఫ్ కూడా అదే తరహా అనారోగ్యం బారినపడి ఆగస్టు 31 నాటికి వరుసగా ప్రాణాలు విడిచారు.

బాధిత పిల్లలందరిలోనూ ఒకే రకమైన తీవ్ర జ్వరం, విరేచనాలు, పలు శరీర అవయవాలు విఫలమవడం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్) వంటి లక్షణాలు కనిపించాయి. అయితే, వారికి నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో డెంగ్యూ, మలేరియా లేదా కోవిడ్-19 వంటి వ్యాధుల ఆనవాళ్లు ఏవీ నిర్ధారణ కాలేదు.

ఈ ఉదంతంపై ఆరోగ్య శాఖ తీవ్ర నిఘా పెట్టింది. జిల్లా ముఖ్య వైద్యాధికారి (CMHO) డాక్టర్ సంజయ్ రిషిశ్వర్ నేతృత్వంలోని ప్రత్యేక వైద్య బృందం, ఆ పిల్లలు చికిత్స పొందిన అన్ని ఆసుపత్రుల నుంచి మెడికల్ రికార్డులను సేకరించి సమగ్ర విచారణ చేపట్టింది.

ప్రస్తుతం ఆ కుటుంబంలో ఒకే ఒక్క చిన్నారి మాత్రమే మిగిలి ఉండటంతో, మిగిలిన కుటుంబ సభ్యులను ఆరోగ్య శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణలో ఉంచారు. ఈ వింత వ్యాధి ప్రబలడానికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషిస్తూ రూపొందించిన నివేదికను తదుపరి విచారణ నిమిత్తం భోపాల్‌లోని రాష్ట్ర ఆరోగ్య డైరెక్టరేట్‌కు పంపించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *